ఏపీతో చర్చలు జరుగుతున్నాయి.. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం: రేవంత్ రెడ్డి

  • పాలమూరు ప్రాజెక్టును సందర్శించిన రేవంత్ రెడ్డి
  • ఏపీతో సమస్యల పరిష్కారికే ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి
  • బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని విమర్శ

పాలమూరు ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే తెలంగాణ ప్రజలకు శుభవార్త చెబుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఏపీతో చర్చలు జరిపినా రాష్ట్ర చట్టబద్ధమైన వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాము 'పంచాయతీ' కంటే 'పరిష్కారానికే' ప్రాధాన్యత ఇస్తామని... పాలమూరు, డిండి పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ వస్తేనే మిగతా చర్చలు ముందుకు సాగుతాయని తేల్చి చెప్పారు.


పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లా తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని సీఎం మండిపడ్డారు. గత ప్రభుత్వం కనీసం భూసేకరణ పనులను కూడా పూర్తి చేయకపోవడం వల్లే ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. కష్టకాలంలో కేసీఆర్‌ను ఆదుకున్న పాలమూరును అధికారంలోకి వచ్చాక ఆయన పట్టించుకోవడం మానేశారని ఆరోపించారు. వలసల జిల్లా అయిన పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం.. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు.

Revanth Reddy
Telangana CM
Palamuru Project
Andhra Pradesh Telangana Water Dispute
Krishna River Water Sharing
Godavari River Water Sharing
Dindi Project
Telangana Congress Government
K Chandrashekar Rao
Palamuru Rangareddy Lift Irrigation

More Telugu News